మీగడ తరకలు

కృష్ణదేవరాయ సింహానికి బిలప్రవేశ దోషం


కృష్ణదేవరాయల వారు ఒకనాడు పెద్ద పళ్ళెం తెప్పించి ఎవరయినా ఒక నిర్దుష్టమయిన పద్యం చెప్పిన వారు , ఆ పళ్ళెరంలోని కానుకలన్నిటినీ తీసుకొనిపోవచ్చు అనగా - పెద్దన గారు -
"శర సంధాన బల క్షమా గురుత రైశ్వర్యంబులున్ కల్గి దు
ర్భర షండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్ మానినన్
నర సింహ క్షితిమండ లేశ్వరుల నెన్నన్ వచ్చు నీ సాటిగా
నరసింహ క్షితిమండలేశ్వరుల కృష్ణా ! రాజకంఠీరవా !"

అని చెప్పాడట.
దీని అర్థం - నరసింహ క్షితి మండలేశ్వరుడి కుమారుడయిన కృష్ణదేవరాయలవారిని నరుడితోనూ, సింహంతోనూ, క్షితిమండలంతోనూ, ఈశ్వరుడితోనూ పోల్చవచ్చుట. ఎప్పుడు? నరుడికి బృహన్నల రూపం లేనప్పుడు, సింహానికి గుహ నివాసం లేకున్నప్పుడు, క్షితి మండలానికి నిరంతర చలనం లేనప్పుడు, ఈశ్వరుడికి బ్రహ్మఘ్నత లేనప్పుడు మాత్రమే అని.
అయితే రామలింగడు ఊరుకుంటాడా? అద్భుతమయిన దోషం ఒకటి చూపించాడట ఇందులో."ఒక పక్క సింహానికి బిలప్రవేశ దోషం ఉంది అని చెపుతూనే, మళ్ళీ కృష్ణరాయలవారిని రాజకంఠీరవా అని సంబోధించడం దోషమే" అని తేల్చి చెప్పాడట.


www.maganti.org